వీరవనిత చాకలి ఐలమ్మ
పేరుమోసిన దొరోడి గడికి కాలినడకన వెళ్లి ‘చాకలి అంటే అరత అలుసా..’ అని ప్రశ్నించింది. తెగిస్తే.. అదే ప్రశ్నిస్తే.. ప్రతి మహిళా రాణిరుద్రమా అవుతుందని నిరూపించింది. ఇంత తెగువ ఎక్కడి నుండి వచ్చింది. ఇంతకి ఆమె ఎవ్వరూ? ఆమే ధీరవనిత చాకలి ఐలమ్మ. ఇప్పుడు అందరూ ఆమెమాటే ఎత్తుతున్నారు. ఆమెలా ఉద్యమించాలని ఢిల్లీ నుండి గల్లీ వరకూ నాయకులు పిలుపునిస్తున్నారు.
ఐలమ్మ పుట్టినిల్లు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామం. ఆ పక్కనే ఉన్న పాలకుర్తి మండల కేంద్రంలో ఆ వీరవనిత మెట్టినిల్లు. చాకలి ఐలమ్మ పుట్టి పెరిగింది పేదింట్లో. కష్టాలు తెలుసు. కన్నీళ్లూ తెలుసు. దొరోడు భూమి లాక్కుంటుంటే విడిచి పెట్టలే. ఈ భూమి నాది అంటూ తిరుగుబాటు చేసింది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరులో అరుణతారలా మెరిసింది. ప్రజా పోరాటాలకు ఆదర్శప్రాయురాలైంది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా కులవృత్తే జీవనాధారం. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. ప్రజలు వెట్టికి గురై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు కల్పించబడ్డాయి. దొరలచే పీడించబడిన జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో ఆంధ్ర మహాసభ నింపిన చైతన్య స్ఫూర్తితో పనిచేయడానికి నిరాకరించింది. ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న భూస్వాములు కుట్రలను తిప్పికొట్టింది. విసునూరు దేశ్ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని, వారికి ఆశ్రయం కల్పిస్తుందని పాలకుర్తి పట్వారీ ఫిర్యాదు చేశారు. రాంచంద్రారెడ్డికి ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉన్నారు. అందులో ఒకరు వీరమనేని శేషగిరిరావు. విసునూరు దొర అండతో గ్రామాల్లో ఏజెంట్లు, వారి అనుచరులు ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు. ఐలమ్మను దెబ్బకొట్టాలని వేచిచూసిన దొరకు పాలకుర్తి జాతర కలిసివచ్చింది. ఆ జాతరలోనే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వేలాది మంది పాల్గొనే జాతరలో తనమాటను ఖాతరు చేయలేరని దేశ్ముఖ్ పోలీసులను ఉపయోగించుకున్నాడు. గుండాలను, అనుచరులను పాలకుర్తికి పంపాడు. రద్దీగా ఉన్న జనంలోకి దేశ్ముఖ్ గుండాలు చేరారు. సభను భగం చేసేందుకు ఘర్షణ సృష్టించారు. అంతకు ముందురోజు నాయకులను హత్య చేస్తామని హెచ్చరించారు. గొడవతో సభ నిలిపివేశారు. కారణాలు వివరించేందుకు నాయకులు సమావేశమయ్యారు. అటుగా వచ్చిన గుండాలు దాడిచేసే ప్రయత్నంలోనే స్థానిక నాయకుడు జీడి సోమనర్సయ్య, కార్యకర్తలు దొర అనుచరుడైన ఓనమాన వెంకయ్యను చితకబాదారు. వాలంటీర్లు అప్రమత్తంగా ఉండటంతో గుండాలు పారిపోయారు. తన అనుచరుడిని దేహశుద్ధి చేయడాన్ని జీర్ణించుకోలేని దేశ్ముఖ్ రాంచంద్రారెడ్డి తనను హత్యచేసేందుకు కుట్ర పన్నారని, అనుచరులపైన దాడికి పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టించారు. ఆ కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుమారులు చిట్యాల సోమయ్య, చిట్యాల లచ్చయ్య, భర్త నర్సయ్యలను ఇరికించారు. అయినప్పటికీ కోర్పులో తీర్పు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన దేశ్ముఖ్ మల్లంపల్లి భూస్వామిని పిలిపించుకున్నాడు. పాలకుర్తిలో ఐలమ్మ సాగుచేస్తున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. ఐలమ్మ సాగుచేసిన భూమి తనదని, పండించిన పంట తనకే దక్కుతుందని పంటను కోసుకరమ్మని వందమంది అనుచరులను పాలకుర్తికి పంపాడు. ఈ విషయాలపై అప్పటికే చర్చించిన కమ్యూనిస్టు నాయకత్వం యువ కిశోరాలను రంగంలోని దించింది. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నిర్మల కృష్ణమూర్తి తదితర నాయకత్వం పాలకుర్తిలో సమావేశం జరిపింది. కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసింది. ఈ సంఘటన నాటికి ఐలమ్మ భర్త, కుమారులు జైల్లోనే ఉన్నారు. జీడి సోమయ్య, వీరమనేని రాంచంద్రయ్య, కమ్మరి బ్రహ్మయ్య, మామిండ్ల కొరరయ్య, ఐలయ్య, జీడి బాలయ్య, చుక్కా సోమయ్య, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, బయటి గ్రామాల నుండి వచ్చిన నాయకులు ఐలమ్మతో సహా పొలం దగ్గర కూర్చున్నారు. పంటను కోసి ఎత్తుకెల్దామని వచ్చిన దొర గుండాలను ఎదిరించారు. ‘ఆంధ్రమహాసభకు జై, దేశ్ముఖ్ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. తాను బతికి ఉన్నంత కాలం భూమి, పంట మీకు దక్కదని ఆవేశపూరితంగా ఐలమ్మ కొంగునడుంకు బిగించి చుట్టి సంఘం అండతో ఎదురించడంతో దేశ్ముఖ్ గుండాలు పలాయనం చిత్తగించారు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. భంగపాటుకు గురైన దేశ్ముఖ్లు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తమ పంటను కమ్యూనిస్టులు దోచుకెళ్లారని నాయకులపై, స్థానికులపై కేసులు పెట్టించాడు. నాయకులను, కార్యకర్తలను అనేక రూపాల్లో చిత్రహింసలు పెడుతున్న పోలీసులను చూసి దేశ్ముఖ్ ఆనందపడిపోయాడు. కోర్టులో గెలిచేందుకు దేశ్ముఖ్ వేసిన పాచికలు పారలేదు. కమ్యూనిస్టు నాయకత్వం చొరవ, కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. కోపోద్రిక్తుడై పాలకుర్తిపై దాడులు నిర్వహించి ఇండ్లను తగులబెట్టించాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాలకుర్తిలో ఐదుగురిని అకారణంగా హత్యచేయించాడు దేశ్ముఖ్. అనేక రకాలుగా నష్టపోయిన ఐలమ్మ కుటుంబం ఎర్రజెండాను వీడలేదు. ఐలమ్మ కుమారులు ముగ్గురు దళకమాండర్లుగా పనిచేశారు. పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించిన ఘనత మరువలేనిది. ఐలమ్మ భూపోరాటం తెలంగాణా సాయుధ పోరుకు తోడ్పాటునందించింది

No comments:
Post a Comment